గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని సీతానగరం లో వైసీపీ అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చివేశారు. నీటిపారుదల శాఖ స్థలంలో పార్టీ కార్యాలయాన్ని ఆక్రమంగా నిర్మిస్తున్నారు. బోట్ యార్డు గా పరిగణిస్తున్న ఆ భూమిని అప్పట్లో వైసీపీ ప్రభుత్వం నామమాత్రపు లీజు తో కొట్టేశారు. ఈ నిర్మాణంపై ఇప్పటికే సీఆర్డిఏ వైసీపీ కి నోటీసులు జారీ చేసింది. ఈ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ని సవాలు చేస్తూ నిన్న ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. చట్టాన్ని మీరి ప్రవర్తించొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిర్మాణాన్ని కూల్చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ భవనాన్ని .. శనివారం తెల్లవారు జామున 5.30 ప్రాంతంలో కూల్చివేత ప్రారంభించారు.
ఇదే కాకుండా రాష్ట్రంలోని జిల్లాల వ్యాప్తంగా పార్టీ కార్యాలయాల కోసం ప్రభుత్వ భూమిని నామమాత్రపు లీజుకి అప్పగించారంటూ అప్పట్లో తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు ఆరోపించారు. మరోవైపు ఈ స్థలంలో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కి మంచినీళ్లు అందించేలా ప్లాంట్ పెడతానని అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున ఖాళీ స్థలం ఉందన్న విషయం వెలుగులోకి వచ్చింది. అందులో రెండు ఎకరాల స్థలాన్ని పార్టీ కార్యాలయం నిర్మించేందుకు ప్రభుత్వం లీజుకి అప్ప చెప్పింది.
కార్యాలయం కూల్చివేత పై జగన్ ట్విట్
వైసీపీ కార్యాలయం కూల్చివేత పై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ‘ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడిన చంద్రబాబు తన దమన కాండను మరో స్థాయికి తీసుకెళ్లారు. నియంతలా మారి దాదాపు పూర్తికావచ్చిన వైసీపీ కార్యాలయాన్ని కూల్చి వేయించారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు. దేశంలో చట్టం, న్యాయం కనుమరుగైపోయాయి. దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు చర్యలను ఖండించాలి’ అని ట్వీట్ చేశారు