ప్రజా సమస్యలు వినిపించడానికి.. సభలో చట్టబద్ధ భాగస్వామ్యం ఉండటానికి తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ మాజీ సీఎం జగన్ స్పీకర్ కి లేఖ రాశారు. ప్రతిపక్షంలో కూర్చోవాలంటే కనీసం 10 శాతం సీట్లు గెలుచుకోవాలనే నిబంధన ఉండనే ఉంది. ఏపీలో 175 సీట్లు ఉన్నాయి. అందులో పది శాతం అంటే 18 సీట్లు గెలుచుకుంటే ప్రతిపక్షంలో దర్జాగా కూర్చోవచ్చు.
అసలు ఆ నిబంధన రాజ్యాంగంలోనే లేదంటున్నారు జగన్. సరే ఆయనకి రాజ్యాంగం మీద ఎంత అవగాహన ఉందనేది పక్కన పెడదాం. అసలు ప్రజా సమస్యలు వినిపించడానికి ప్రతిపక్షంలోనే ఉండాలా? జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉండే ప్రజల పక్షాన నిలబడ్డారా? ఒకవేళ వైసీపీ నిజంగా ప్రతిపక్ష హోదా కోరుకుంటుందే అనుకున్నాం.
రెండు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి కదా. అప్పుడే తమకి హోదా ఇవ్వమని ధైర్యంగా, డైరెక్ట్ గా అసెంబ్లీలోనే ఎందుకు అడగలేకపోయారు? అసలు స్పీకర్ ఎన్నిక రోజు వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ ఎందుకు డుమ్మా కొట్టారు? ఇలా ఎన్నో ప్రశ్నలు చర్చకు వస్తున్నాయి. నిజానికి ఆ ప్రశ్నల్లో వాస్తవం లేకపోలేదు.
జనాల పక్షాన నిలబడి వారి సమస్యలు వినిపించడానికి సభలో చట్టబద్ధత కోరుకుంటుంది వైసీపీ.ప్రస్తుతం వాళ్ల చేతుల్లో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గత ఐదేళ్లలో ఒక్క సీటు గెలుచుకోని జనసేన ప్రజల సమస్యల గురించి ఆలోచించింది కదా. అసలు అసెంబ్లీలో స్థానమే లేని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాద బాధితులకి రూ. 50,000 ఆర్థిక సాయం అందించారు. కదా. ఇప్పటం లో ఇల్లు కూల్చివేతకు గురైన బాధితులకు రూ. లక్ష ఆర్థిక సాయం చేశారు కదా. పంట నష్టంతో ఆత్మహత్యలు చేసుకున్న 73 మంది రైతులకు రూ.లక్ష చొప్పున సాయం ప్రకటించారు కదా. ఇవే కాకుండా హ్యూమన్ ట్రాఫికింగ్, ఏపీలో రోడ్ల దుస్థితిపై ఎక్కడ వీలైతే అక్కడ.. ఎప్పుడు వీలైతే అప్పుడు ప్రభుత్వ లోటుపాట్లను నిలదీశారు.
ప్రతిపక్షంలో లేకపోయినా పవన్ ఇదంతా చేసినప్పుడు వైసీపీ ఎందుకు హోదా కోరుకుంటుంది?. ప్రతిపక్ష హోదాలో కాకపోయినా 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తమ గొంతుక వినిపించవచ్చు కదా అనేది రాజకీయ విశ్లేషకుల ప్రశ్న.