చిన్న చిన్న మార్పులు.. పెద్ద పెద్ద ఆనందాల్ని ఇస్తాయ్.! రాజకీయాల్లో ఎవరు అధికారంలో వుంటే వారు, తమ పేర్లతో సంక్షేమ పథకాల్ని అమలు చేయడం చూస్తున్నాం. తమ పేర్లతోనో, తమకు నచ్చినవారి పేర్లతోనో (వాళ్ళూ రాజకీయ ప్రముఖులే అయినప్పుడు) సంక్షేమ పథకాల్ని అమలు చేయడం అనేది ఓ ‘అనవసరమైన’ ఆనవాయితీ అయి కూర్చుంది.
చంద్రబాబు హయాంలో ‘చంద్రన్న’ పేరుతోనూ, ‘ఎన్టీయార్’ పేరుతోనూ చాలా సంక్షేమ పథకాలు అమలయ్యాయి. అంతకు ముందు కాంగ్రెస్ పాలనలో, ఇందిర అలాగే రాజీవ్ గాంధీ పేర్లను ఎక్కువగా వాడేశారు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి.
ఏ సంక్షేమ పథకమైనా ప్రజాధనంతోనే కదా అమలు చేయాలి.? పాలకులంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవకులు కదా.? మరి, ఆ సేవకుల పేర్లను, యజమానులైన ప్రజలకు అందించే సంక్షేమ పథకాలకు పెట్టడమేంటి.? ఆ మాత్రం ఇంగితం అధికారంలో వున్నోళ్ళకి ఎందకు లేకుండా పోతోంది.?
అసలు, ఈ పద్ధతి మారే అవకాశం లేదని అంతా అనుకున్నారు. కానీ, మార్పు మొదలైంది. అదీ జనసేనతోనే ఆ మార్పుని స్పష్టంగా చూస్తున్నాం. టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే కొన్ని మార్పులు జరుగుతున్నాయ్. జగన్, వైఎస్సార్ పేర్లతో అమలయిన సంక్షేమ పథకాలకు పేర్లను మార్చారు.
కొన్నింటికి ఎన్టీయార్ పేర్లు పెట్టారనుకోండి.. కానీ, అంబేద్కర్ లాంటి మహనీయుల పేర్లను పెట్టడం.. అదీ, జనసేన వల్లనేనని భావించాలి. అంతే కాదు, కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకి ‘పీఎం’ అనే ప్రస్తావనతో పేర్లు పెడుతున్నారు.
జగనన్న గోరు ముద్ద అని గతంలో అమలైన సంక్షేమ పథకానికి, పీఎం పోషణ గోరు ముద్ద అని పేరు పెట్టారు. తెలుగునాట.. అందునా, ఆంధ్ర ప్రదేశ్కి చెందిన ఎందరో మహనీయులున్నారు. వారి పేర్లను సంక్షేమ పథకాలు పెడితే, మహనీయుల్ని స్మరించుకున్నట్లవుతుంది.
కూటమిలో సీట్ల పరంగా అగ్రస్థానం టీడీపీది గనుక, ఈ ‘చిన్న’ చిన్న మార్పుల్ని మాత్రమే ప్రస్తుతానికి ఆశించగలం. ముందు ముందు ఈ మార్పు మరింత పెద్దదవుతుందనే ఆశిద్దాం. సంక్షేమం ప్రజల హక్కు.. అది ఎవరో వేసే బిచ్చం అయితే అస్సలు కాదు.