అనిల్ కుమార్ యాదవ్ మంత్రి ఏంటి.? అంబటి రాంబాబు మంత్రి ఏంటి.? అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు బాధ్యత వీళ్ళ చేతుల్లోకి వెళ్ళడమేంటి.? కాస్తంత ఇంగితం అయినా వుండాలి కదా.! జల వనరుల శాఖ అంటే.. అది అత్యంత కీలకమైనది. అనుభవం వున్న ప్రజా ప్రతినిథులు మంత్రులుగా వుంటే తప్ప, ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు ముందుకు కదిలే పరిస్థితి లేదు.
కానీ, అనిల్ కుమార్ యాదవ్ అలాగే అంబటి రాంబాబు.. చెరి రెండున్నరేళ్ళు.. జల వనరుల శాఖ మంత్రులుగా పని చేశారు. నిజానికి, అస్సలు పని చేయలేదు. పని చేసే వుంటే, పోలవరం ప్రాజెక్టు ఈపాటికే పూర్తయిపోయేది. 2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తయిపోతుందని మీసం మెలేసి, తొడకొట్టారు.. అసెంబ్లీలో అనిల్ కుమార్ యాదవ్.
మంత్రి పదవి పోగానే, ‘నేను మాజీని.. నాకు ఆ ప్రాజెక్టు గురించి ఏమీ తెలియదు.. నన్ను అడక్కండి..’ అని తప్పించుకు తిరిగారు అనిల్ కుమార్ యాదవ్ అప్పట్లో. ఆ తర్వాత అంబటి రాంబాబు వచ్చారు. ‘నాకు ప్రాజెక్టు గురించి తెలియదు. అది నాకు అర్థం కాలేదు..’ అని ఈయనా, మంత్రి పదవి పోయాక ఇప్పుడు చెబుతున్నారు.
పైగా, ‘నాకు అర్థం కాలేదంటే, ఎవరికీ అర్థం కాదు’ అని కూడా అంబటి రాంబాబు స్టేట్మెంట్ ఇచ్చేశారు తాజాగా. పోలవరం ప్రాజెక్టుని వైసీపీ నాశనం చేసిందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? కేంద్రం కొన్ని నిధులు గడచిన ఐదేళ్ళ కాలంలో ఇచ్చింది. కాంట్రాక్టర్లు కిందా మీదా పడి కొన్ని పనులు అయితే చేశారు.
చంద్రబాబు హయాంలోనే, పోలవరం ప్రాజెక్టు స్పిల్ వేకి సంబంధించి గేట్లను అమర్చేందుకు అన్ని ఏర్పాట్లూ జరిగాయి. ఆ గేట్ల ఏర్పాటు వైసీపీ హయాంలోనే పూర్తయ్యింది. డ్యామ్ పైన రోడ్డు నిర్మాణం కూడా జరిగింది. పనులు జరిగాయ్.. కానీ, ప్రాజెక్టు నాశనమైపోయింది. కఫర్ డ్యామ్ వ్యవహారం కావొచ్చు, ఇతరత్రా వ్యవహారాలు కావొచ్చు.. ఇవిప్పుడు అర్థం కాని సమస్యలుగా మారాయ్.
ఐదేళ్ళనేది ఏ ప్రాజెక్టుకి అత్యంత కీలకం. అలాంటిది, పదేళ్ళయినా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదంటే ఏమనుకోవాలి.? వాస్తవానికి, అంతకన్నా ముందే ప్రారంభమైన ప్రాజెక్టు ఇది. వైసీపీ చేసిన నష్టం గురించి ఇప్పుడు చర్చ అనవసరం. జరగాల్సిందేమిటి.? ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీలైనంత వేగంగా దృష్టిపెట్టి, పనుల్ని వీలైనంత వేగంగా పునఃప్రారంభించాలి.