ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు ఇంకా, ఇటీవలి ఎన్నికలపై కామెంట్లు ‘పాస్’ చేస్తూనే వున్నారు.. ప్రజలు తమని ఫెయిల్ చేశారని అర్థం చేసుకోకుండా.! ఓ వైపు, దారుణ పరాజయం పాలైనా, 40 శాతం ఓట్లు వచ్చాయని చెబుతూనే.. ఇంకో వైపు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని వైసీపీ గగ్గోలు పెడుతున్న తీరు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
2019 ఎన్నికల్లో కూడా అప్పటి అధికార పార్టీకి దాదాపు 40 శాతం ఓట్లు వచ్చాయ్.. 23 సీట్లు మాత్రమే వచ్చాయ్. ఇప్పుడు వైసీపీకి కూడా దాదాపు అవే 40 శాతం సీట్లు వచ్చాయ్.. సీట్ల సంఖ్య మాత్రం 11కి పడిపోయింది.
ఎన్నికల్లో గెలుపోటములకు మధ్య తేడా ఒక్కోసారి పది పాతిక ఓట్లు కూడా వుండొచ్చు. అదే నంబర్ గేమ్ అంటే.! ఆ లెక్కన గెలిచే పార్టీకీ ఓడిపోయే పార్టీకీ మధ్య మొత్తంగా ఓ పది వేల ఓట్లు తేడా వున్నా.. ఆశ్చర్యపోవాల్సిన పని వుండదు.
‘మీకూ మాకూ తేడా ఒకటిన్నర శాతమే..’ అని ఒకప్పుడు వైసీపీ, అప్పటి అధికార టీడీపీ మీద గుస్సా అయిన సందర్భాలూ వున్నాయ్. ఇప్పుడు ఓట్ల శాతంలో తేడా కాస్త ఎక్కువే కనిపిస్తోంది కదా.! కాస్త కాదు, చాలానే తేడా వుంది. దాంతో, సీట్ల సంఖ్యలో కూడా చాలా తేడా వుంటుంది.
ప్రజలు తమను ఈడ్చి కొట్టారన్న విషయాన్ని వైసీపీ ముందుగా అర్థం చేసుకోవాలి. అది మానేసి, ఈవీఎంల మీద ఆరోపణలు చేస్తే, వైసీపీ ఎప్పటికీ పుంజుకుని, నిలబడే పరిస్థితి వుండదు. పైగా, ఈవీఎంల మీద ఆరోపణలు చేస్తూ, కేంద్రంలో అధికారంలో వున్న ఎన్డీయే కూటమికి లోక్ సభలో వైసీపీ మద్దతివ్వడాన్ని ఎలా చూడాలి.?
ఎన్డీయే అంటే కేవలం బీజేపీ మాత్రమే కాదు, అందులో టీడీపీ, జనసేన కూడా వున్నాయి. అంటే, పరోక్షంగా టీడీపీ, జనసేనలకి కూడా వైసీపీ రాజకీయంగా మద్దతిస్తోందన్నమాట. మరి, ఈవీఎంల మీద ఆరోపణలు దేనికి.? ఎవర్ని మభ్యపెట్టడానికి.? 40 శాతం ఓట్లు.. 10 శాతానికో ఐదు శాతానికో పడిపోకూడదనుకుంటే, వైసీపీ.. ఇకనైనా పనికిమాలిన ఆరోపణలు పక్కన పడేసి, బాథ్యగా ప్రవర్తించాలి.
ఒక్కటి మాత్రం నిజం.. ఈవీఎం ట్యాంపరింగ్కి అవకాశమే వుంటే, తిరుపతి లోక్ సభ నియోజకవర్గాన్ని బీజేపీ గెలుచుకునేదే.! అసలు వైసీపీకి ఒక్క అసెంబ్లీ సీటుగానీ, ఒక్క లోక్ సభ సీటుగానీ దక్కేది కాదు. వైసీపీకి ఐదారు శాతం ఓట్లు కూడా వచ్చేవి కావు మొత్తంగా.! ఈ వాస్తవాన్ని వైసీపీ ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది.