అగనంపూడి టోల్ గేట్ ఎత్తేశారట.! అసలు అగనంపూడి ఎక్కడుంది.? ఆ టోల్ గేట్ వ్యవహారమేంటి.? ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చాలామందికి ఈ టోల్ గేట్ గురించి తెలియదు. కానీ, విశాఖ వాసులకి మాత్రం ఈ టోల్ గేట్ చాలాకాలంగా ఓ పెద్ద తలనొప్పి వ్యవహారమైకూర్చుంది.
గతంలో జనసేన పార్టీ ఈ టోల్ గేట్కి వ్యతిరేకంగా విశాఖ వాసుల తరఫున ఉద్యమించింది. జనసేనాని విశాఖలో పర్యటించిన పలు సందర్భాల్లో టోల్ గేట్ ఎత్తివేతపై నినదించారు. నగరాన్ని ఆనుకుని కాదు, నగరంలోనే వుంటుందీ టోల్ గేట్.! అదే అసలు సమస్య.
ఎట్టకేలకు టోల్ గేట్ ఎత్తివేయబడింది. దీన్ని కూటమి ప్రభుత్వ విజయంగా కూటమి పార్టీలు చెబుతున్నాయి. టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక, విశాఖ ప్రజలకు నిజంగానే ఈ టోల్ గేట్ ఎత్తివేతతో పెద్ద ఊరట లభించింది.
టోల్ గేట్ ఎత్తివేతపై విశాఖ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూటమి విజయం.. ప్రత్యేకించి, జనసేన పార్టీ సాధించిన అతి పెద్ద విజయం.. అంటూ విశాఖ వాసులు నినదిస్తుండడం గమనార్హం.
నిజానికి, ఈ టోల్ గేట్ వ్యవహారం కూడా, ఇటీవలి ఎన్నికల్లో వైసీపీ పరాజయానికి కారణంగా విశాఖ వాసులు చెబుతున్నారు. వాస్తవానికి వైసీపీ హయాంలోనే ఈ టోల్ గేట్ని ఎత్తివేయాల్సి వున్నా, తెరవెనుక లాలూచీల కారణంగా టోల్ గేట్ ఎత్తివేతకు వైసీపీ ససేమిరా అనేసినట్లు తెలుస్తోంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తాను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన సందర్భంలో చూసిన వివిధ కీలక సమస్యలకు ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఆయా సమస్యలకు పరిష్కార మార్గాలు చూపిస్తుండడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపడం, ఆచూకీ తెలియకుండా పోయిన మహిళల్ని కనుగొనే దిశగా పోలీస్ అధికారుల్ని ఆదేశిస్తుండడం.. ఇలా జనసేనాని ‘వర్క్ మోడల్’ ప్రజల్లోకి బలంగానే వెళుతోంది. ఇక, తాజాగా విశాఖ అగనంపూడి టోల్ గేట్ ఎత్తివేత అంశం, జనసేన పార్టీకి ప్రజల్లో మంచి మైలేజ్ తెచ్చిపెడుతోంది.