పోలవరం ప్రాజెక్టు గురించి ‘ప్రెజెంటేషన్’ ఇచ్చేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు. గతంలో ఆయన జల వనరుల శాఖ మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే.
పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పలు అంశాలపై అప్పట్లో ఆయన్ని మీడియా ప్రశ్నిస్తే, ‘అన్ని విషయాలూ నాకు తెలియాలని రూల్ ఏమీ లేదు’ అన్నారు. అంతేనా, ‘మీకు అన్నీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు’ అని కూడా గదమాయించారు. కానీ, ఇప్పుడు మీడియా ముందుకొచ్చి, పోలవరం ప్రాజెక్టు గురించి చాలా చాలా వివరాలు సెలవిచ్చారు.
పోలవరం ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి లేదని తాను గతంలోనే చెప్పాననీ, అదే ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు చెబుతున్నారనీ అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద పోలవరం ప్రాజెక్టు పేరు చెప్పి చంద్రబాబు బురద చల్లుతున్నారనీ అంబటి రాంబాబు ఆరోపించేశారు.
ఓ బోర్డు మీద, పోలవరం ప్రాజెక్టు నమూనాని ‘గీసేసి’, ఏవేవో మాట్లాడేశారు అంబటి రాంబాబు. మీడియా ప్రతినిథులు అంబటి రాంబాబు ‘నైపుణ్యం’ చూసి ఆశ్చర్యపోయారు. ఈయనేనా ఒకప్పుడు జల వనరుల శాఖ మంత్రిగా పని చేసింది.? అని ముక్కున వేలేసుకున్నారు.
అప్పట్లో ఎప్పుడూ అంబటి రాంబాబు, పోలవరం ప్రాజెక్టు గురించి ప్రెస్ మీట్ పెట్టింది లేదు. ఇలా, ప్రెజెంటేషన్లు ఇచ్చింది కూడా లేదు.! ఎప్పుడు అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టినా, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించే మాట్లాడేవారు అంబటి. అంతేనా, పవన్ కళ్యాణ్ సినిమాలకి రివ్యూలు కూడా ఇచ్చేవారు మంత్రి హోదాలో అంబటి రాంబాబు.
వైసీపీ హయాంలో అంబటి రాంబాబు ఒక్కరే కాదు, ఏ మంత్రి కూడా తమ శాఖల గురించి మాట్లాడకూడదని అధినాయకత్వం నుంచి స్పష్టమైన హెచ్చరికలతో కూడిన ఆదేశాలు వుండేవేమో.! అందుకే, మంత్రులెవరూ తమ శాఖల గురించి మాట్లాడలేదని అర్థం చేసుకోవాలిప్పుడు జనం.!
మంత్రిగా వున్నప్పుడే పోలవరం ప్రాజెక్టు గురించి అంబటి రాంబాబు మాట్లాడి వుంటే, ఇంత ఘోర ఓటమి ఆయనకు తప్పి వుండేదేమో.!