కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ ( 76) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గుండెపోటుకు గురై తుది శ్వాస విడిచారు. 1948 సెప్టెంబర్ 27న నిజామాబాద్ లో పుట్టిన ఆయన’ డీఎస్ ‘ గా తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తొలిసారిగా 1989 లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆ ఏడాది నుంచి 1994 వరకు రూరల్ డెవలప్మెంట్, ఐ అండ్ పి ఆర్ మంత్రిగా పనిచేశారు.
2004 నుంచి 2008 వరకు ఉన్నత విద్య, అర్బన్ ల్యాండ్ సీలింగ్ శాఖల మంత్రిగా ఆయన సేవలందించారు. 2004, 2009 ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడిగానూ పనిచేశారు. రాష్ట్రం విడిపోయాక 2015 లో భారతీయ రాష్ట్ర సమితి లో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. తర్వాత ఆ పార్టీ నుంచి బయటికి వచ్చి మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
శ్రీనివాస్ కి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరైన ధర్మపురి అర్వింద్ ప్రస్తుతం బీజేపీ తరపున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు.
డీఎస్ కి కాంగ్రెస్ అధిష్టానంతో మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రణబ్ ముఖర్జీ, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ లతో ఆయన సన్నిహితంగా ఉండేవారు. జైపాల్ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డిలతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి.