జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాస్తా, పిఠాపురం ఎమ్మెల్యే.. ఆపై, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యారు.! ఉప ముఖ్యమంత్రిగా ఆయన నిన్ననే బాధ్యతలు స్వీకరించారు కూడా.
డిప్యూటీ సీఎం హోదాలో తొలి సంతకం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన సంబంధిత పనులకు అనుసంధానించి, నిధులు మంజూరు చేసే అంశం మీద పెట్టారు పవన్ కళ్యాణ్. రెండో సంతకాన్ని గిరిజన గ్రామాల్లో నూతన పంచాయితీ భవనాల నిర్మాణానికి నిధులను విడుదల చేసేందుకు వీలుగా సంబంధిత దస్త్రంపై చేశారు డిప్యూటీ సీఎం.
అనంతరం, పంచాయితీరాజ్ సహా గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, గ్రామీణ రక్షిత మంచినీటి, శాస్త్ర సాంకేతిక తదితర శాఖలకు సంబంధించి ఆయా శాఖల అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు.
ఉదయం బాధ్యతల స్వీకరణ అనంతరం, సాయంత్రం వరకూ ఈ సమీక్షలు కొనసాగాయి. సుదీర్ఘంగా దాదాపు 8 నుంచి 10 గంటల వరకు డిప్యూటీ సీఎం ఆయా శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
రోడ్ల దుస్థితి గురించీ, మంచి నీటి సౌకర్యం సరిగ్గా లేకపోవడం గురించీ.. ఇలా తన శాఖల పరిధిలోకి వచ్చే పలు అంశాలపై అధికారులను ఆరా తీశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయా విభాగాలకు సంబందించి నివేదికలు తన ముందుంచాలని అధికారులను ఆదేశించిన పవన్ కళ్యాణ్, కలిసి పనిచేద్దాం.. మెరుగైన పాలన అందిద్దామని అధికారులకు సూచించారు.
మామూలుగా అయితే, బాధ్యతల స్వీకరణ కార్యక్రమం అట్టాహాసంగా ప్రారంభించేసి, నామ్ కే వాస్తే.. అన్నట్లుగా సంతకాలు చేసేసి, తూతూ మంత్రంగా సమీక్షలు చేసేయడం.. అనేది ఆనవాయితీగా వస్తుంటుంది. కానీ, ఈసారి మంత్రి వర్గంలో దాదాపుగా ప్రతి మంత్రీ, ఆయా శాఖల సంబంధిత విషయాలపై పూర్తిస్థాయిలో సమీక్షలు, బాధ్యతలు స్వీకరిస్తూనే చేస్తున్నారు.
మరీ ముఖ్యంగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయా శాఖలకు సంబంధించి, సుదీర్ఘంగా సమీక్షించడం చర్చనీయాంశమయ్యింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకూ చూసుకుంటే, రాజకీయ విమర్శలకు దూరంగా.. తన పని తాను చేసుకుపోతున్న వైనం, అధికార వర్గాల్లోనూ ఒకింత ఆసక్తిని రేపుతోందిట.