ఓదార్పు యాత్ర ఎలా చేశారోగానీ, ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రజలకు దూరమైపోయారు. ఎప్పుడన్నా జనంలోకి వెళ్ళాల్సి వస్తే, పరదాల చాటున వెళ్ళాల్సిందే.
పరదాలు లేనిదే, చెట్లు కొట్టేయనిదే.. జనంలోకి వెళ్ళే పరిస్థితి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వుండేది కాదు.. ఆయన ముఖ్యమంత్రిగా వున్నన్నాళ్ళూ.! ఏం.? ఎందుకిలా.? ముఖ్యమంత్రికి భద్రత కల్పించడమంటే.. మరీ ఇలానా.?
చంద్రబాబు కూడా ముఖ్యమంత్రి హోదాలో జనంలోకి వెళుతున్నారు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంగతి సరే సరి.! నిజానికి, పవన్ కళ్యాణ్కే సెక్యూరిటీ పరంగా సమస్యలెక్కువ.! వైసీపీ ఉన్మాదుల నుంచి ఆయనకు థ్రెట్ ఎప్పుడూ వుంటుంది. డిప్యూటీ సీఎం అయ్యారు కదా.. అది ఇంకాస్త ఎక్కువే వుండొచ్చు.
కానీ, పవన్ కళ్యాణ్ జనంలో వుంటున్నారు, జనంతో వుంటున్నారు. అధికారంలోకి రాకముందు జన వాణి కార్యక్రమాన్ని నిర్వహించిన జనసేనాని.. ఇప్పుడేమో డిప్యూటీ సీఎం హోదాలోనూ ఆ జన వాణి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. తనను కలిసేందుకు పార్టీ కార్యాలయానికి వచ్చినవారితో, పార్టీ కార్యాలయం యెదుటే మాట్లాడుతున్నారు. సమస్యల్ని పరిష్కరిస్తున్నారు.
ఇక్కడ పరదాల్లేవ్.. కేవలం ప్రజా సేవ తప్ప.! రాష్ట్రంలో ఏ మంత్రికీ ఈ పరదా సమస్య లేదు. నిజానికి, ఏ మంత్రి కూడా.. గతంలో మంత్రుల్లా అతి చేయడంలేదు. వైసీపీ హయాంలో ఎమ్మెల్యేలు కూడా మంత్రుల తరహాలో.. అంతకు మించి ఓవరాక్షన్ చేయడం చూశాం.
ఇప్పుడు మంత్రులు కూడా సాధారణ ప్రజా నాయకుల్లా జనంలో తిరుగుతున్నారు.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధి ప్రదర్శిస్తున్నారు. మరీ ముఖ్యంగా, జనసేన ప్రజా ప్రతినిథులు, తాము ప్రజల్లో ఒకరం.. అన్నట్లుగా.. గతంలో వున్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. కాకపోతే, ఇప్పుడు అధికారులతో పనులు చకచకా చేయిస్తున్నారంతే.
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా మహిళల అదృశ్యానికి సంబంధించి వైసీపీ హయాంలో పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ విషయానికి సంబంధించి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్, వివరాలు తెప్పించుకుంటున్నారు. నేరుగా తనకు ఫిర్యాదులు చేస్తున్నవారికి సంబంధించిన సమస్యల పరిష్కారాన్నీ వేగంగా చూపుతున్నారు.
పరిపాలన అంటే, ప్రజలకు మెరుగైన పాలన అందించడం. అంతేగానీ, పరదాల చాటున దాక్కోవడం కాదు.! పచ్చని చెట్లను నాశనం చేయడం అంతే కంటే కాదు.! పదవి అంటే బాధ్యత. పాలన అంటే సేవ.! ప్రజలకు పాలకులు ఎప్పుడూ సేవకులే.! ప్రజా ప్రతినిథుల భద్రత దృష్ట్యా ప్రోటోకాల్ తప్పు కాకపోవచ్చు.. కానీ, ప్రోటోకాల్ పేరు చెప్పి, పరదాల చాటున దాక్కుంటే.. ప్రజలు ఇచ్చే తీర్పు ఎలా వుంటుందో ఇటీవలి ఎన్నికల్లో చూశాం కదా.!