జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో తొలిసారి ప్రసంగించారు. పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం కూడా అయిన కొణిదెల పవన్ కళ్యాణ్, అసెంబ్లీలో తన తొలి ప్రసంగంతోనే అందరి మన్ననలూ అందుకున్నారు. అందరి దృష్టినీ ఆకర్షించారు. నాయకుడంటే ఇలా వుండాలి.. శాసన సభ్యుడంటే ఇలా వుండాలి.. అని ప్రతి ఒక్కరూ చర్చించుకునేలా పవన్ కళ్యాణ్ ప్రసంగం సాగింది.
స్పీకర్ ఛెయిర్లో కూర్చున్న చింతకాయల అయ్యన్న పాత్రుడిపైనా తనదైన ఛమక్కులతో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇంతకాలం చూపిన వాగ్ధాటిని స్పీకర్గా అయ్యన్నపాత్రుడు వదిలేయాల్సి వుంటుందని డిప్యూటీ సీఎం పవన్ సూచించారు.
అర్థవంతమైన చర్చకు శాసన సభ వేదిక కావాలనీ, అంతే తప్ప బూతులు తిట్టుకోవడానికి సభా సమయాన్ని వృధా చేయరాదని డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యానించారు. ‘గత అసెంబ్లీలో ఎలాంటి దురదృష్టకర పరిస్థితులున్నాయో చూశాం. ఆ తప్పిదాల్ని మనం చేయకూడదు. సభ్యులెవరైనా హద్దులు దాటే పరిస్థితి వుంటే, స్కూల్ మాస్టారిలా స్పీకర్ మైక్ కట్ చేయాల్సి వుంటుంది’ అని డిప్యూటీ సీఎం సూచించడం గమనార్హం.
‘మేం ఓడినా పారిపోలేదు.. దురదృష్టం, వైసీపీ పారిపోయింది. గతంలో దక్కిన అద్భుత విజయంపై విర్రవీగడం వల్లే వైసీపీ 11 సీట్లకు పరిమితమయ్యిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ‘భాష అనేది మనుషుల్ని కలపడానికి తప్ప, విడగొట్టడానికి కాదు’ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల హర్షం వ్యక్తమవుతోంది.
ఎంతటి జఠిల సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కారం లభిస్తుందనీ ఉప ముఖ్యమంత్రి, అసెంబ్లీలో తన తొలి ప్రసంగం సందర్భంగా వ్యాఖ్యానించారు. కాగా, రెండో రోజు అసెంబ్లీ సమావేశాలకు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డుమ్మా కొట్టారు.
స్పీకర్గా చింతకాయల అయ్యన్నపాత్రుడి నియామకం పట్ల జగన్ అసహనంతో వున్న విషయం విదితమే. సభా సంప్రదాయాల ప్రకారం, స్పీకర్గా ఎంపికైన వ్యక్తుల్ని ఆయా పార్టీల శాసనసభా పక్ష నేతలు, స్పీకర్ ఛెయిర్ వద్దకు తీసుకు వెళ్ళాల్సి వుంటుంది.