వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నరసరావు పేట లో ఆయన్ని అదుపులోకి తీసుకొని ఎస్పీ ఆఫీసుకు తరలించారు. కాసేపట్లో ఆయన్ని మాచర్ల కోర్టు ముందు హాజరు పరిచే అవకాశం ఉంది. ఎన్నికల పోలింగ్ రోజు ఈవీఎం ను ధ్వంసం చేసి, అడ్డొచ్చిన వారిపై దాడి చేసిన కేసులో పిన్నెల్లి ఇప్పటికే ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. తాజాగా హైకోర్టు ఆ బెయిల్ పిటిషన్ లని కొట్టేయడం తో పిన్నెల్లి అరెస్టయ్యారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రం లో కి ప్రవేశించిన పిన్నెల్లి అక్కడ ఈవీఎం ని ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన వారిపై దాడికి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద నాలుగు కేసులు నమోదు చేశారు. అరెస్టు చేస్తారన్న భయంతో పరారయ్యారు. తర్వాత తనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలంటూ పిటిషన్ వేసి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు. తాజాగా హైకోర్టు ఆ ఉత్తర్వులను రద్దు చేసి, బెయిల్ పిటిషన్లని తిరస్కరించింది.