అప్పులు.. అప్పులు.. ఆ అప్పులకి వడ్డీలు.. వడ్డీలకు మళ్ళీ వడ్డీలు.! ఓ సామాన్యుడు అప్పు చేయాలంటే, ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. అలాంటిది, ఓ ప్రభుత్వం అప్పు చేయాలంటే.. ఇంకెంత ఆలోచించాలి.? ఆలోచించుకోవడాలేం లేవు.. అందినకాడికి అప్పు చేసేయడమే.. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేసెయ్యడమే.
నొక్కు.. మళ్ళీ నొక్కు.. మళ్ళీ మళ్ళీ బటన్లు నొక్కు.! ఇదీ వైసీపీ హయాంలో జరిగిన బటన్ల నొక్కుడు వ్యవహారం. బటన్ నొక్కాలంటే అప్పులు చేయాల్సిందే. చేసేశారు కూడా. మరి, ఆ అప్పుల ఊబి నుంచి బయట పడేదెలా.?
జగన్ ప్రభుత్వమైనా, అంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వమైనా, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వమైనా.. అప్పులు చేసే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
కాకపోతే, రాష్ట్రానికి రాజధాని అంటూ ఒకటి వుంటే, ఆ రాజధాని కేంద్రంగా ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుంటుంది. రాష్ట్రానికి ఆ రాజధాని పెద్దన్నలా మారుతుంది. ఆ రాజధానిని చంద్రబాబు హయాంలో ఏర్పాటు చేస్తే, దాన్ని గడచిన ఐదేళ్ళలో వైసీపీ నాశనం చేసి పారేసింది.
ఇప్పుడు మళ్ళీ రాజధాని.. అంటే, మొదటి నుంచీ మొదలెట్టాలి. కాదు కాదు, పాతాళం నుంచీ మొదలెట్టి పైకి తీసుకురావాలి. అదేమంత తేలికైన వ్యవహారం కాదు. అప్పులు మళ్ళీ షురూ అయ్యాయ్. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే, అప్పులు చేయాల్సిందే.
కడుపు కట్టుకోవాలి.. నిజమే, సొంత పబ్లిసిటీ పూర్తిగా మానుకోవాలి.. అప్పుడే, అప్పులు కాస్త తక్కువగా చేయడానికి ఆస్కారం వుంటుంది. ప్రస్తుతానికైతే ప్రభుత్వం పబ్లిసిటీ స్టంట్స్ జోలికి వెళ్ళడంలేదు. ముందు ముందు ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేం. కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో రాష్ట్రానికి చేయూత అందాలి.
కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే కూటమే అధికారంలో వుంది గనుక, అప్పుల ఊబి నుంచి రాష్ట్రం బయటపడుతుందనే ఆశిద్దాం.