ద్రోణీ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీ, యానాం మీదుగా నైరుతీ, పశ్చిమ గాలులు వీస్తున్నాయని తెలిపింది. వీటి ప్రభావంతో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. తీరం వెంబడి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.
శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, నెల్లూరు, అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో మంగళవారం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి.
ఈసారి తగినన్ని అల్పపీడన ప్రాంతాలు ఏర్పడకపోవడంతో నైరుతి రుతుపవనాలు మందకొడిగా కదిలినట్లు.. ఫలితంగా జూన్ నెలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంతగా 11% లోటు ఈ నెలలో నమోదయింది. 2001 తర్వాత ఇలా జరగడం ఇది ఏడోసారి.