భారత దేశ పౌరుడిగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హిమాలయాలకు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఆయన్ని ఎవరైనా ఆపగలరా.? కానీ, దేశ సరిహద్దులు దాటి, హిమాలయాలకు అటువైపు వెళ్ళాలంటే మాత్రం కోర్టు అనుమతి తప్పనిసరి. హిమాలయాలకు నేపాల్ నుంచో, చైనా నుంచో కొంతమంది టూరిస్టులు వెళుతుంటారు. అలా జగన్ కూడా వెళ్ళాలంటే, ముందుగా కోర్టు అనుమతి తీసుకోవాలి.
ఇప్పుడీ హిమాలయాల సందర్శనం గోలేంటి.? అంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓడిపోగానే, హిమాలయాలకు వెళ్ళిపోవాలనుకున్నారట. ఈ మాటే, పార్టీ ముఖ్య నేతల సమావేశంలో చెప్పారట వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వై నాట్ 175 అని గొప్పలు చెప్పుకుని, 11 సీట్లకు వైసీపీ పరిమితమైపోతే.. హిమాలయాలకు పోవాలన్న ఆలోచన కలగడం మామూలుగా ఎవరికైనా అయితే సహజమే.
అలా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ అనిపించిందేమో.! కానీ, ఓటమి ముందే తెలుసు కదా.? ఓటమి భయంతోనే కదా, అత్యంత జుగుప్సాకరమైన రాజకీయాల్ని ఎన్నికల ముందర వైసీపీ చేసింది. పార్టీ శ్రేణుల్ని మభ్యపెట్టి, ‘గడప గడపకీ వైసీపీ’ అన్నారు, ఇంటింటికీ జగనన్న స్టిక్కర్లు అతికించారు.
దింపుడు కళ్ళెం.. అన్న చందాన, వైసీపీ ఎన్నికల ముందర చేసిన స్టంట్లు అన్నీ ఇన్నీ కావు. కానీ, అప్పటికే వైసీపీ చచ్చిపోయింది. కాకపోతే, జూన్ 4న అధికారికంగా ప్రకటితమైందంతే. ఫలితాల వెల్లడికి ముందు కూడా, ఐ-ప్యాక్ కార్యాలయానికి వెళ్ళి, 151 కంటే ఎక్కువ సీట్లు వస్తాయంటూ వైఎస్ జగన్ అబద్ధాలు చెప్పగలిగారంటే.. ఆయన మామూలోడు కాదు.
అలాంటి జగన్, ఎన్నికల ఫలితాల తర్వాత హిమాలయాలకు వెళ్ళిపోవాలనుకున్నానంటూ చెబితే, అది నమ్మేంత అమాయకులా వైసీపీ నాయకులు.? ‘ఇంకా మీ మాటల్ని విశ్వసించే పరిస్థితుల్లో వున్నామా.?’ అని వైసీపీ నేతలు తమలో తాము అనుకునే వుంటారు.
‘అయినా, నిన్నెందుకు హిమాలయాలకు రానిస్తారు.? అవి కూడా కబ్జా చేసేద్దామనా.?’ అంటూ సోషల్ మీడియాలో వైఎస్ జగన్కి వ్యతిరేకంగా ట్రోలింగ్ జరుగుతోంది. జరగదా మరి, అధికారంలో వున్న ఐదేళ్ళు.. రాష్ట్రాన్ని నిలువునా వైసీపీ దోచేసింది.
ఆ మాటకొస్తే, తన తండ్రి వైఎస్సార్ అధికారంలో వున్నప్పుడే, జగన్ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారంటూ ఆయన మీద బోల్డన్ని కేసులు నమోదయ్యాయ్.. ఆ కేసుల నేపథ్యంలోనే ఆయన పదహారు నెలలు జైల్లో వున్నారు.! ఇంకా నయ్యం.. పులివెందులలో హిమాలయాల సెట్ వేసేసుకుని, అక్కడే ధ్యానం చేసుకుంటానని జగన్ అన్లేదంటూ.. సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయ్ మరి.!