Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో వారాహి విజయ యాత్ర సందర్భంగా కొంత ఎమోషనల్ అవడం, జనసైనికుల్నీ ఇంకా ఎమోషనల్ అయ్యేందుకు కారణమయ్యింది.
రాజోలు నియోజకవర్గాన్ని 2019 ఎన్నికల్లో జనసేన గెలుచుకుంది. అదొక్కటే, జనసేన 2019 ఎన్నికల్లో గెలుచుకున్న నియోజకవర్గం. కానీ, జనసేన ఎమ్మెల్యే కాస్తా, ఆ తర్వాత వైసీపీలో చేరిపోయారు. జనసేనలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్కి ఎంత ప్రాధాన్యతనిచ్చినా, ఆయన దాన్ని కాదనుకుని.. వైసీపీలోకి దూకేసిన సంగతి తెలిసిందే.
2019 ఎన్నికల్లో ఓడిపోయాం.. ఒకే ఒక్క నియోజకవర్గం నుంచి గెలిచాం.. చీకట్లో చిరు దీపం లాంటి గెలుపు అది.. రాజోలు నుంచి రాజంపేట వరకూ.. ఈసారి సత్తా చాటుదాం.. అంటూ జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు జనసేనాని.
‘మనం గెలిపించుకున్న ఎమ్మెల్యే మనల్ని మోసం చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కదా, పార్టీ మారాలి. జనసేన అధికారంలోకి వస్తే.. పార్టీ మారాలనుకున్న ఎమ్మెల్యేలు, పదవులకు రాజీనామా చేసేలా చేస్తాం..’ అంటూ జనసేనాని స్పష్టం చేశారు.
నియోజకవర్గంలో ఇసుక దోపిడీ ఎక్కువైపోయిందనీ, కాలుష్య కాసారంలోకి నెట్టేశారనీ, రోడ్లన్నీ గతుకులమయం అనీ.. జనసేనాని స్థానిక సమస్యల్ని ప్రస్తావించారు. జనసేనకు 18 శాతం వరకు ఓటు బ్యాంకు వుందనీ, అది రానున్న రోజుల్లో గణనీయంగా పెరగబోతోందన్నారు జనసేనాని.
రాజోలులో జనసైనికులు 2019 ఎన్నికల్లో ప్రదర్శించిన స్ఫూర్తిని, రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోనూ ముందు ముందు చూపాలనీ, జనసేనను గెలిపించే దిశగా కష్టపడాలన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ‘జనసైనికుల మీదా, వీర మహిళల మీదా చేతులు వేస్తే, మేం అధికారంలోకి వచ్చాక అలాంటివారు అందరికీ తగిన బుద్ధి చెబుతాం’ అని జనసేనాని హెచ్చరించారు.