కర్ణుడు గొప్పోడా.? అర్జునుడు గొప్పోడా.? ఈ రచ్చ ఇప్పుడు తెలుగు నాట హాట్ టాపిక్. అదీ సోషల్ మీడియా వేదికగా. ‘కర్ణుడు వెధవ’ అనే స్థాయికి చర్చోపచర్చలు జరుగుతున్నాయంటే, అలా చర్చించుకుంటున్నవాళ్ళు ఏ స్థాయికి దిగజారిపోయారో అర్థం చేసుకోవచ్చు.
అసలు కర్ణుడు ఎవరు.? అర్జునుడు ఎవరు.? మహాభారత యుద్ధం ఎందుకు జరిగింది.? ఈ అంశాలపై కనీసపాటి అవగాహన లేనోళ్ళు, సోషల్ మీడియాలో డిబేట్లు షురూ చేసేశారు. ఎవరైనాసరే, మహాబారతాన్ని రిఫరెన్స్గా తీసుకోవాల్సిందే. సందర్భాన్ని బట్టి ఆయా పాత్రల ప్రవర్తన వుంటుందే తప్ప, మహాభారతంలో ఎవరూ చెడ్డవాళ్ళు కాదు.
ధర్మం, అధర్మం.. ఈ రెండిటి గురించే మహాభారతంలో చర్చ జరుగుతుంది. ధర్మం వైపు నిలబడినవారు గెలుస్తారు.. అధర్మం వైపు నిలబడినవారు అంతమైపోతారు. మహాభారతం చెప్పేది ఇదే. మహాభారత యుద్ధం.. భగవద్గీత.. ఇవేమీ ఆషామాషీ వ్యవహారాలు కాదు.
పాత సినిమాల్లో చూపించినట్టు, ఇప్పటి సినిమాల్లో మనం చూస్తున్నట్టు.. మహాభారత యుద్ధం అలాగే జరిగిందా.? భగవద్గీతలోనూ అదే వుందా.? అంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. ‘సినిమాటిక్ లిబర్టీ’ అంటుంటాం కదా.. సినిమాల విషయంలో అదే జరుగుతుంటుంది.
అసలు కర్ణుడు ఎందుకు కౌరవుల వైపు నిలబడ్డాడు.? దుర్యోధనుడ్ని అంతమొందించేందుకు కృష్ణుడు ఏం చేశాడు.? ఇవన్నీ చర్చించుకోవాల్సి వస్తే.. అది చాలా పెద్ద కథ అవుతుంది. ఒక్క సినిమాతో మహాభారత యుద్ధం గురించి చెప్పలేం. ఓ వంద ఎపిసోడ్లు, వెయ్యి ఎపిసోడ్ల టీవీ సీరీస్ కూడా సరిపోదు.
కర్ణుడు గొప్పోడు.. అర్జునుడూ గొప్పోడే.. ఆ మాటకొస్తే, దుర్యోధనుడు కూడా గొప్పోడే.! ధర్మానికీ, అధర్మానికీ మధ్య మహాభారత యుద్ధం జరిగింది. అది అర్థం చేసుకోవడం మానేసి, కర్ణుడిని కించపర్చి, అర్జునుడిని అవమానించి.. ఏం సాధిద్దామని.?
ఇదంతా ‘కల్కి’ సినిమా విడుదల తర్వాత జరుగుతున్న రచ్చ. సినిమాలో కర్ణుడి పాత్రలో ప్రభాస్ కనిపించిన సంగతి తెలిసిందే. అందుకే ఇంత రాద్ధాంతం.