జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గనుక పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిస్తే, తన పేరుని ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానంటూ ఎన్నికలకు ముందర సంచలన రీతిలో సవాల్ విసిరారు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.
దాంతో, అంతా విస్తుపోయారు. రాజకీయాల్లో సవాళ్ళు, ప్రతి సవాళ్ళు మామూలే.! అయినా, కాపు సామాజిక వర్గంలో పుట్టి, పేరు చివర్న ‘రెడ్డి’ అని పెట్టుకోవడమేంటన్న ఆశ్చర్యం అంతటా వ్యక్తమయ్యింది.
మొత్తమ్మీద, ముద్రగడ పద్మనాభం మాట నిలబెట్టుకున్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా జనసేనాని పవన్ కళ్యాణ్ బంపర్ మెజార్టీతో గెలిచిన దరిమిలా, తాను ఈ విషయంలో ఓటమి చెందానని ప్రకటిస్తూ, తన పేరుని ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటున్నట్లు వెల్లడించారు మాజీ మంత్రి ముద్రగడ.
ఈ మేరకు ప్రక్రియ కూడా ప్రారంభించినట్లు ముద్రగడ గతంలోనే ప్రకటించారు. ఆ ప్రక్రియ పూర్తయ్యింది. ముద్రగడ పద్మనాభం పేరు మారిపోయింది. ఇకపై ఆయన ముద్రగడ పద్మనాభ రెడ్డి. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదలయ్యింది.
ఇంతకీ, పేరు మాత్రమే మారిందా.? కులం కూడా మారిపోయిందా.? ఇకపై ఆయన్ని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా భావించాల్సి వుంటుందా.? ఇలాంటి ప్రశ్నలు సామాన్యుల్లో వ్యక్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో.!
‘ముద్రగడ పద్మనాభం కాపు సామాజిక వర్గంలో చెడబుట్టారు..’ అంటూ కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ‘నిజానికి, పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు. కేవలం పవన్ కళ్యాణ్ గెలవడాన్ని తట్టుకోలేక ఆయన తన పేరుని మార్చుకున్నాడన్నదాంట్లో అర్థం లేదు.
ముందుగానే ఆయనకు ఆ ఆలోచన వుంది.. పవన్ కళ్యాణ్ గెలుస్తారని తెలిసీ, ముద్రగడ ఈ పబ్లిసిటీ స్టంట్కి తెరలేపారు..’ అన్న చర్చ అంతటా జరుగుతోంది.
పవన్ కళ్యాణ్ గెలిస్తే, రాజకీయాల్లోంచి తప్పుకుంటామన్న వైసీపీ నేతలు ఇంకా రాజకీయాల్లోనే వున్నారు. కూటమి గెలిస్తే, అర గుండు, అర మీసంతో తిరుగుతామన్న నేతలు దర్జాగా తిరుగుతున్నారు. కానీ, ముద్రగడ మాత్రమే ‘రెడ్డి’ని తగిలించుకున్నారంటే, ఈ ‘రెడ్డి’ రాజకీయం వెనుక అసలు కుట్ర ఏంటన్నది సుస్పష్టం.!