రాజకీయాల్నీ కులాల్నీ విడదీసి చూడగలమా.? రాజకీయాల్లో కులాల, మతాల ప్రస్తావన లేకపోవడం అనేది సాధ్యమా.? ఛాన్సే లేదు.! ఆ కులం పేరు చెప్పుకునే కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు. ఆ కులాభిమానంతోనే, కొందర్ని రాజకీయ నాయకులుగా గుర్తించే పరిస్థితిని చూస్తున్నాం.
కులాన్ని నమ్ముకుని రాజకీయం చేయాలనుకున్న ముద్రగడ పద్మనాభం లాంటోళ్ళు, ఏరు దాటాక తెప్ప తగలేసిన చందాన, కులాన్ని అవమానించడం మొదలు పెట్టారు. దాంతో, సహజంగానే కులం అలాంటివాళ్ళను వదిలించుకుంటుంది. ముద్రగడ విషయంలో అదే జరిగింది.
తన పేరు చివర్న ‘రెడ్డి’ అనే తోకని తగిలించుకున్న ముద్రగడ పద్మనాభం పూర్తిగా, కాపు సామాజిక వర్గానికి దూరమయ్యారు. పోనీ, రెడ్డి సామాజిక వర్గం అయినా ఆయన్ని అక్కున చేర్చుకుంటుందా.? అంటే, ‘పేరు మార్చుకుంటే కులం మారిపోదు..’ అంటూ రెడ్డి సామాజిక వర్గం, ముద్రగడ పద్మనాభం మీద విసుర్లు విసురుతోంది.
ఎలా చూసినా, ముద్రగడ పద్మనాభ ‘రెడ్డి’ రెంటికీ చెడ్డ రేవడిలా తయారయ్యారన్నది సుస్పష్టం. ఇంతకీ, ఈ ముద్రగడ పద్మనాభ రెడ్డి వల్ల ఎవరికి లాభం.? ఎవరికి నష్టం.? తమకేదో రాజకీయంగా లబ్ది చేకూరుతుందని ఆయన్ని వైసీపీ, తనవైపుకు తిప్పుకుంది.
నిజానికి, ముద్రగడ పద్మనాభం ‘వైసీపీ అభిమానిగా’ మారి చాలా ఏళ్ళయ్యింది. ఆయన ఎప్పుడూ వైసీపీ మనిషే.! కాపు సామాజిక వర్గం తరఫున పోరాటమంటూ, ఆత్రం ప్రదర్శించింది కూడా వైసీపీకి రాజకీయ లబ్ది చేకూర్చడానికే.
2019లో ముద్రగడ మంత్రం వైసీపీకి కలిసొచ్చింది. అదే ముద్రగడ మంత్రం, వైసీపీని 2024లో పూర్తిగా ముంచేసింది. ఇకపై, ముద్రగడ పుణ్యమా అని కాపు సామాజిక వర్గం, వైసీపీని శతృవుగా చూసే పరిస్థితి కనిపించనుందన్నది ఆ సామాజిక వర్గంలో వినిపిస్తోన్న వాదన.
పవన్ కళ్యాణ్ మీద ముద్రగడ చేసే ప్రతి విమర్శా, వైసీపీకి కాపు సామాజిక వర్గాన్ని మరింత దూరం చేస్తుందన్నది నిర్వివాదాంశం. ముద్రగడకు వైసీపీ ఇంకాస్త ప్రాధాన్యతనిస్తే, రెడ్డి సామాజిక వర్గం కూడా వైసీపీని దూరం పెట్టే పరిస్థితి రావొచ్చు.