కాస్త ఆలస్యంగానే అయినా, నేషనల్ మీడియా గట్టిగానే ఏకి పారేస్తోంది నేషనల్ మీడియా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రిగా, కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిపోయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, ‘ఏపీ సద్దాం హుస్సేన్’ అని నేషనల్ మీడియా ముద్దుగా పిలుచుకుంటోంది.
కారణం, రుషికొండ ప్యాలెస్ సముదాయమే.! వైసీపీ హయాంలో, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం అలాగే క్యాంప్ కార్యాలయం కోసం అత్యుత్సాహంతో ఈ భవన సముదాయాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. అదీ, దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల ప్రజాధనంతో.
అంతకు ముందు, పర్యాటక శాఖ రిసార్టు వుండేదిక్కడ. ఆ రిసార్టు ద్వారా ప్రభుత్వానికి బోల్డంత ఆదాయం కూడా వచ్చి వుండేది. దాన్ని ఆదునీకరిస్తున్నాం.. అని చెబుతూ, ముఖ్యమంత్రి నివాసం, క్యాంప్ కార్యాలయం కోసం ఐదు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పర్యాటక శాఖ వెచ్చించింది.
ఆ భవనాల నిర్మాణాన్ని అత్యంత గోప్యంగా వుంచుతూ, అనుమతి లేకుండా ఎవర్నీ అటువైపు వెళ్ళనీయకుండా వైసీపీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అదంతా ఇప్పుడు బట్టబయలయిపోయింది. బండారం బయటపడేసరికి, అవి పర్యాటక శాఖ భవనాలేనంటూ బుకాయింపులకు దిగుతోందిప్పుడు వైసీపీ.
రాష్ట్రపతి లాంటి ప్రముఖులు విశాఖకు వస్తే, వారికి ఆతిథ్యం ఇచ్చేందుకు ఈ భవనాలు పనికొస్తాయంటూ వైసీపీ కథలు చెబుతోంటే, నేషనల్ మీడియా సైతం ఆక్షేపిస్తోంది వైసీపీ మాటల్ని. జగన్ కోసమే ఆ భవనాల్ని అక్రమంగా నిర్మించారంటూ జగన్ మోహన్ రెడ్డిని ఏకంగా నియంత సద్దాం హుస్సేన్తో పోల్చుతోంది.
‘జగన్ మోహన్ రెడ్డిని సద్దాం హుస్సేన్తో పోల్చడం సబబు కాదు’ అంటూ నేషనల్ మీడియా చర్చా కార్యక్రమంలో వాపోయారు వైసీపీ నేత రవిచంద్రారెడ్డి. కానీ, నేషనల్ మీడియా మాత్రం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ‘ఏపీ సద్దాం హుస్సేన్’ అంటూ ఏకిపారేయడం ఆపడంలేదు. సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.