ఆర్టీసీ కార్మికులు మెట్టు దిగినా, తెలంగాణ ప్రభుత్వం ససేమిరా అంటోంది. విలీన డిమాండ్ని పక్కన పెట్టినట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు సంకేతాలు పంపించిన తర్వాత కూడా, చర్చలకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడంలేదంటే ఇక్కడ మేటర్ క్లియర్.. తెలంగాణలో ఆర్టీసీ ఉనికిని ప్రభుత్వం సహించే పరిస్థితి లేదన్నట్లే కదా అర్థం.!
ఆర్టీసీ సమ్మెని చట్ట విరుద్ధమేనంటూ ఇంకోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఆర్టీసీ యాజమాన్యం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఆర్టీసీ కార్మికులు తాము ప్రభుత్వ ఉద్యోగులతో సమానమవుతామని అనుకున్నారు. కానీ, పరిస్థితులు మారాయి. రాజకీయ నాయకులు చెప్పే మాటలకీ, చేసే పనులకీ చాలా తేడా వుంటుందనే విషయం అర్థమయ్యేసరికి పరిస్థితి చెయ్యిదాటిపోయిందని ఆర్టీసీ కార్మికులు వాపోతున్నారు.
నిజానికి, విలీన డిమాండ్తో సమ్మె చేస్తున్న కార్మికుల్లో కొందరు బలవన్మరణాలకు పాల్పడుతుండడం, ఇంకొకరు ఒత్తిడితో ప్రాణాలు కోత్పోతుండడం జరుగుతోందంటే.. ప్రభుత్వం మానవీయ కోణంలో ఈ అంశాన్ని చూడాల్సి వుంటుంది.
తెలంగాణ ఉద్యమం సమయంలో ఏ మరణం చోటు చేసుకున్నా, దాన్ని ‘త్యాగం’ కోటాలో వేసేశారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇప్పుడు మాత్రం, ఆర్టీసీ కార్మికుల మరణాలకి బాధ్యత తమ ప్రభుత్వానిది కాదు.. కార్మిక సంఘాలదేనని అంటున్నారు.
తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ సమాజం అంతా ఒక్కటైతే, ఆ క్రెడిట్ని పూర్తిగా తన ఖాతాలో వేసుకుని, కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠమెక్కిన విషయం విదితమే. ఇప్పుడేమో, ఆర్టీసీ విషయంలో ఇదిగో ఇలా రూటు మార్చేశారు.
ఒక్కటి మాత్రం నిజం.. సమ్మెతో ఆర్టీసీకి నష్టం వాటిల్లుతోంది. అయితే, అంతకన్నా ఎక్కువ నష్టం తెలంగాణ ప్రభుత్వం కారణంగానే ఆర్టీసీకి వాటిల్లిందన్న ఆర్టీసీ కార్మికుల వాదనలోనూ నిజం లేకపోలేదు.
ఏదిఏమైనా, ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆగేలా కన్పించడంలేదు.. ప్రభుత్వమూ ఆర్టీసీని తెలంగాణలో వుంచేలా కన్పించడంలేదు. కానీ, ఆర్టీసీలో కేంద్రం వాటా.. అలాగే ఉమ్మడి రాష్ట్రం విభజన తర్వాత ఏపీఎస్ఆర్టీసీ విభజన పూర్తిగా జరగలేదన్న వాదనలు.. వెరసి, కార్మికుల్లో ఇంకా ‘ఆశలు’ సజీవంగానే వుండే అవకాశం వుందన్నమాట.
749901 288276Some truly select articles on this internet internet site , bookmarked . 552347