రాజకీయం అంటేనే బూతు.! బూతులు మాట్లాడకపోతే రాజకీయాల్లో మనుగడ కష్టం.! ఎవరు ఎక్కువ బూతులు మాట్లాడగలిగితే, వాళ్ళకు అంత మంచి పదవులు.! ఇదీ, గడచిన ఐదేళ్ళలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నడిచిన రాజకీయం.! ఇది వైసీపీ రాజ్యాంగం.!
మీడియా మైకులు కూడా బూతులు మాట్లాడే రాజకీయ నాయకుల వెంట పడ్డాయి. కొందరు మహిళా జర్నలిస్టులూ, బూతులు ఎవరు బాగా మాట్లాడతారోనని వెతుక్కుంటూ వారి దగ్గరకు వెళ్ళి మైకులు పెట్టి, తమక్కావాల్సిన కంటెంట్ని రాబట్టుకోవడం చూశాం.
ఇంకొంచెం సిగ్గొదిలేసి, మహిళా జర్నలిస్టులు అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం జుట్లు పట్టుకోవడం కూడా చూశాం. ఈ జుట్లు పట్టుకుని కొట్టుకునే వికృత క్రీడలో గెలిచిన మహిళా జర్నలిస్టుకి వైసీపీ హయాంలో ఓ పదవి కూడా దక్కిందండోయ్.!
కానీ, ఇప్పుడలాంటివేమీ కనిపించడం లేదు. న్యూస్ ఛానళ్ళు ప్రశాంతంగా కనిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగాయి. రాష్ట్ర ప్రజలు, ప్రశాంతంగా అసెంబ్లీ సమావేశాల్ని తిలకించారు.
ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారు.? డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారు.? హోం మంత్రి ఎలా వ్యవహరిస్తున్నారు.? ఇతర మంత్రులు వారి వారి శాఖల గురించి ఏం మాట్లాడుతున్నారు.? వంటి విషయాల్ని న్యూస్ ఛానళ్ళ ద్వారా జనం తెలుసుకుంటున్నారు. పత్రికలు కూడా చదువుతున్నారు.
నిజమే, ప్రస్తుతానికి రాజకీయం చాలా ప్రశాంతంగా వుంది. కానీ, ఇదే వాతావరణం ముందు ముందు కూడా కొనసాగుతుందా.? కొనసాగాలంటే, బూతులు మాట్లాడే రాజకీయ నాయకుల్ని మీడియా నిషేధించాలి. అలాగే, బూతుల కోసం ఎగబడే మీడియా సంస్థల్ని రాజకీయ నాయకులు కూడా బ్యాన్ చేయాలి.! అయితే, సాధ్యమయ్యే పనేనా ఇది.?