అర్నాబ్ గోస్వామి.. పరిచయం అక్కర్లేని పేరిది.! నేషనల్ మీడియాని ఫాలోయే అయ్యేవారికి, అర్నాబ్ డిబేట్స్ ఎలా వుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రిపబ్లిక్ న్యూస్ ఛానల్ ద్వారా ఏకిపారేస్తుంటాడాయన.. ఏ విషయమ్మీద ఎవర్నయినా.!
మన రుషికొండ వ్యవహారం, ఇప్పుడు ఆర్నాబ్ దృష్టిలో పడింది. పడటమేంటి.. నలిగిపోతుంటేనూ.! తెలుగు మీడియా, ఈ కుంభకోణాన్ని మమ.. అన్నట్లుగా టచ్ చేసి వదిలేసింది. నేషనల్ మీడియా మాత్రం, వైసీపీ హయాంలో జరిగిన దోపిడీని కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది.
అసలు రుషికొండపై వైసీపీ హయాంలో ఏం నిర్మించారో చెప్పలేని పరిస్థితి వైసీపీ నేతలది. దాన్ని టూరిజం భవనం అనాలా.? ప్రభుత్వ గెస్ట్ హౌస్ అనాలా.? సీఎం క్యాంప్ కార్యాలయం అనాలా.? ఇవేవీ కాదు, ఓ లగ్జరియస్ స్టార్ హోటల్ అనాలా.? ఏదీ అర్థం కావడంలేదాయె.
కానీ, అందులో లగ్జిరయస్ ఐటమ్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. దాదాపు 25 లక్షల రూపాయల విలువ చేసే బాత్ టబ్.. సుమారుగా అంతే విలువ చేసే బాత్రూమ్ కమోడ్ విషయమై అర్నాబ్ గోస్వామి, వైసీపీని ఓ రేంజ్లో ర్యాగింగ్ చేస్తున్నారు.
రుషికొండ ప్యాలెస్ కోసం వినియోగించిన బాత్ టబ్ని విశాఖపట్నంలో ఏదో ఒక సెంటర్లో ఏర్పాటు చేసి, జరిగిన దోపిడీని ప్రజలకు అర్థమయ్యేలా చేయాలంటూ అర్నాబ్ గోస్వామి ఓ ఉచిత సలహా ఇచ్చారు తన డిబేట్లో.
అదే డిబేట్లో పాల్గొన్న వైసీపీ నేత రవిచంద్రారెడ్డికి ఈ విషయమై నోట మాట రాలేదు. మామూలుగా తెలుగు మీడియాలో అయితే, రవిచంద్రారెడ్డి అర్థం పర్థం లేని అరుపులతో టాపిక్ డైవర్ట్ చేసేస్తారుగానీ, నేషనల్ మీడియాలో అలాంటి పప్పులుడకవ్ మరి.!
ఎక్కడో ఎందుకు, జగదాంబ సెంటర్లో బాత్ టబ్ అలాగే బాత్రూమ్ కమోడ్.. ఈ రెండిటినీ ఏర్పాటు చేసెయ్యాలంటూ రుషికొండ ప్యాలెస్ పేరు చెప్పి దుర్వినియోగం చేసిన ప్రజాధనంపై విశాఖ జనం చర్చించుకుంటున్నారు.