ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ కొలువుదీరింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు నిన్న ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో శాసన సభ్యులుగా పదవీ ప్రమాణం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో పదవీ ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష హోదాకి తగిన స్థాయిలో ఎమ్మెల్యేలను వైసీపీ గెలుచుకోలేకపోయిన దరిమిలా, వైఎస్ జగన్ కూడా అసెంబ్లీలో సాధారణ ఎమ్మెల్యే మాత్రమేనన్నది ఓ వాదన.
కాస్సేపట్లో అసెంబ్లీ స్పీకర్ ఎన్నికపై అధికారిక ప్రకటన విడుదలవుతుంది. ప్రొటెం స్పీకర్గా సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్యేలతో పదవీ ప్రమాణం చేయించిన సంగతి తెలిసిందే. స్పీకర్గా చింతకాయల అయ్యన్నపాత్రుడు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఎన్నిక ఏకగ్రీవమయ్యింది కూడా.
స్పీకర్గా అయ్యన్నపాత్రుడి నియామకాన్ని ఇప్పటికే వైసీపీ తప్పుుపట్టింది. కానీ, అయ్యన్న పాత్రుడికి పోటీగా, వైసీపీ ఇంకో అభ్యర్థిని నిలబెట్టలేకపోయిందనుకోండి.. అది వేరే సంగతి.
ఇక, అసెంబ్లీకి వెనుకదారిలో హాజరైన వైఎస్ జగన్, ఎమ్మెల్యేగా పదవీ ప్రమాణం అనంతరం, ఎక్కువసేపు అసెంబ్లీలో వుండలేకపోయారు. వుండి వుంటే, బావుండేదన్న చర్చ అంతటా జరుగుతోంది.
ఇదిలా వుంటే, వైఎస్ జగన్ సొంత పత్రిక సాక్షి, తమ యజమానికి ‘ప్రతిపక్ష నేత’ అనే హోదాని కట్టబెట్టడం చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుతానికైతే వైఎస్ జగన్ కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. మాజీ ముఖ్యమంత్రి అన్న గుర్తింపు అలాగే వుంటుంది లెండి. అది మళ్ళీ వేరే చర్చ.
మొత్తం 11 మంది ఎమ్మెల్యేలున్నారు వైసీపీ తరఫున ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో. దాంతో, వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కే అవకాశమే లేదు. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ అవకాశం వుండకపోవచ్చు. అయితే, కూటమి ప్రభుత్వం గనుక.. టీడీపీ తర్వాత అసెంబ్లీలో అతి పెద్ద పార్టీ జనసేన అయినా, విపక్షం మాత్రం వైసీపీనే అవుతుంది.
ఎలా చూసినా జగన్ మోహన్ రెడ్డిని విపక్ష నేతగా ప్రస్తావించాలి తప్ప, ప్రతిపక్ష నేత అనడానికి వీల్లేదన్నది అంతటా వినిపిస్తోన్న వాదన. ఇంకా నయ్యం, ఇప్పటికీ జగన్ మోహన్ రెడ్డే సీఎం అనే భావనలో, ఆ దిశగా జగన్ సొంత పత్రికలో ‘సీఎం జగన్’ అనే ప్రస్తావన కనిపించలేదు.!