వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరాన శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే రోజుల్లో వాయువ్య దిశగా పయనించనుంది. ఈ అల్పపీడనం తుఫానుగా మారుతుందా లేదా అన్నదానిపై వాతావరణ శాఖ స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ తుఫానుగా మారినా రాష్ట్రానికి ప్రమాదం ఉండదని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇది నైరుతీ రుతుపవనాల సీజన్ లో ఏర్పడిన తొలి అల్పపీడనంగా వారు పేర్కొంటున్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు ఒడిశా, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాల వైపు వెళతాయని అంచనా వేస్తున్నారు.
మరోవైపు ద్రోణీ ప్రభావంతో రాబోయే రెండు, మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ సమయంలో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు పడతాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.