డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్.. అంటుంటారు. కానీ, గడచిన ఐదేళ్ళలో ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి అనేది ఆగిపోయింది. చంద్రబాబు హయాంలో అమరావతిని ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా నిర్ణయిస్తే, వైఎస్ జగన్ హయాంలో ఆ అమరావతిని ‘కమ్మరావతి’గా పేర్కొంటూ, రాజధానిని విశాఖకు తరలించేందుకు నానా రకాల కుటిల యత్నాలూ జరిగాయి.
మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. మరి, రాజధాని అమరావతి పరిస్థితేంటి.? కొద్ది రోజుల క్రితమే చంద్రబాబు, ముఖ్యమంత్రి హోదాలో అమరావతిలో పర్యటించి, గతంలో తన హయాంలో ప్రారంభమై ఆ తర్వాత జగన్ హయాంలో ఆగిపోయిన నిర్మాణాల్ని పరిశీలించారు.
ఐదేళ్ళ కాలం అంటే తక్కువేమీ కాదు. నిర్మాణంలో వున్న భవనాలు పాతబడిపోయాయి. ఇనుము తుప్పు పట్టేసింది.. ఆ ప్రాంతమంతా దట్టమైన పొదలతో నిండిపోయింది. వాటిని శుభ్రం చేసి, పనులు మళ్ళీ మొదలు పెట్టాలంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ, తప్పదు.
అసలంటూ అమరావతి పనుల పునఃప్రారంభానికి కొత్త ముహూర్తం ఏమైనా వుందా.? ఆ పనులు ఇప్పటికే మొదలయ్యాయా.? అన్నదానిపై స్పష్టత లేదు. కొన్ని భవనాలకు సంబంధించి తక్కువ ఖర్చుతోనే, పనులు పూర్తయిపోయే అవకాశం వుంది. వాటిపై ప్రభుత్వం ముందుగా దృష్టి పెట్టాల్సి వుంది.
రాజధాని అనేది ప్రజల ఆత్మగౌరవం.. ఏ రాష్ట్రంలో అయినా సరే.! జగన్ హయాంలో మూడు రాజధానులని పేర్కొంటూ, అందులో అమరావతిని ఓ రాజధానిగా చూపిస్తూ కూడా, అమరావతిని గడచిన ఐదేళ్ళలో జగన్ సర్కారు పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం చేసింది.
ఈ నేపథ్యంలో సమయం అస్సలు వృధా కాకుండా, రాజధాని అమరావతికి సంబంధించి పనుల పునఃప్రారంభం అత్యంత వేగంగా జరగాల్సి వుంది.