వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే హోదాలో శాసనసభకు నిన్న హాజరు అయి వుండాల్సింది. స్పీకర్ ఎన్నిక జరిగింది గనుక, స్పీకర్ గౌరవార్ధం.. సభలోని అన్ని పార్టీలకు చెందిన శాసన సభ్యులూ వుండి వుండాల్సింది. అది సంప్రదాయం. కానీ, స్పీకర్ ఛెయిర్లో అయ్యన్న పాత్రుడిని చూడటం ఇష్టం లేక వైఎస్ జగన్, శాసన సభకు డుమ్మా కొట్టారు.
సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్ళిపోయారు వైఎస్ జగన్. సరే, వైఎస్ జగన్ సొంత నియోజకవర్గానికి వెళ్ళడాన్ని తప్పు పట్టలేం. శాసన సభలో కాస్సేపు వుండి, ఆ స్పీకర్ ఎన్నిక వ్యవహారం తర్వాత పులివెందులకు వైఎస్ జగన్ వెళ్ళి వుంటే ఎవరూ ఆక్షేపించే పరిస్థితి వుండదు.
నచ్చినా, నచ్చకున్నా సభలో సంప్రదాయాల్ని పాటించాలి. శాసన సభ్యుడిగా పదవీ ప్రమాణం చేసిన వైఎస్ జగన్, ఆ ప్రమాణానికి కట్టుబడి వుండకపోతే ఎలా.? ఇప్పుడీ చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. జగన్ని అసెంబ్లీకి పంపించి తప్పు చేశాం.. అన్న భావన పులివెందుల ప్రజానీకంలో రాకూడదు.
వైసీపీకి చెందిన ఇతర ప్రజా ప్రతినిథుల విషయంలోనూ ప్రజలు అలా అనుకునే పరిస్థితి వస్తోందంటే, వైసీపీ వ్యవహార శైలి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. ‘ఔను, వైఎస్ జగన్ శాసన సభకు భయపడి పులివెందులకు పారిపోయారు..’ అని సాక్షాత్తూ వైసీపీ అభిమానులే అనాల్సి వస్తోంది.
ఈ మేరకు పలువురు వైసీపీ అభిమానులు, సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు, వీడియోలు కూడా విడుదల చేస్తున్నారు. వీళ్ళంతా గతంలో కరడుగట్టిన వైసీపీ అభిమానులు.. ఇప్పుడు కూడా ఆ వైసీపీకి అభిమానులుగానే వున్నారు.
కడప విమానాశ్రయంలో దిగుతూనే, ‘సీఎం జగన్’ అంటూ కొందరు నినదించారు. ఈ తరహా పెయిడ్ బ్యాచ్తో రాజకీయాలు చేయడం వైసీపీకి కొత్తేమీ కాదు. వైనాట్ 175 అని చెప్పి, 11 సీట్లకు పరిమితమై కూడా ఇలా ‘సీఎం జగన్’ అనే నినాదాలు చేయించుకున్నారంటే, ఈ పరిస్థితిని ఏమనాలి.?
ఏమో, వైఎస్ జగన్ ఎందుకు హఠాత్తుగా పులివెందుల వెళ్ళాల్సి వచ్చిందోగానీ, శాసన సభలో స్పీకర్, సీఎం, డిప్యూటీ సీఎం, హోం మినిస్టర్.. ఇలా రాజకీయ ప్రత్యర్థుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతో జగన్ పారిపోయారన్న వాదనకే బలం చేకూరుతోంది.