జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన ఇద్దరు లోక్ సభ అభ్యర్థులూ గెలుస్తారని, ఫలితాలకు ముందే ఎగ్జిట్ పోల్ అంచనాలు చెప్పేశాయి. బాలశౌరి లేదా తంగెళ్ళ ఉదయ్.. ఈ ఇద్దరిలో ఒకరికి కేంద్ర మంత్రి పదవి ఖాయమన్న ప్రచారమూ జరిగింది. బాలశౌరికి అయితే క్యాబినెట్ హోదా, తంగెళ్ళ ఉదయ్కి అయితే సహాయ మంత్రి హోదా దక్కుతుందంటూ ఊహాగానాలు వినిపించాయి.
కానీ, జనసేన పార్టీ తరఫున గెలిచిన ఇద్దరు ఎంపీలలో ఎవరికీ కేంద్ర మంత్రిగా అవకాశం దక్కలేదు. టీడీపీ నుంచి మాత్రం ఇద్దరు ఎంపీలు కేంద్ర మంత్రులయ్యారు. ఈ విషయమై జనసేన శ్రేణుల్లో ఒకింత అసంతృప్తి వుంది.
జాతీయ స్థాయిలో జనసేన విక్టరీ గురించి చర్చ జరుగుతున్న దరిమిలా, ప్రధాని నరేంద్ర మోడీ, జనసేన పార్టీకి చెందిన ఎంపీల్ని తన మంత్రి వర్గంలోకి తీసుకుంటే బావుంటుందన్న డిమాండ్లు ఇప్పటికీ వినిపిస్తున్నాయి జనసేన మద్దతుదారుల నుంచి. ఇంతలోనే, జనసేన పార్టీకి ఓ రాజ్యసభ పదవి దక్కనుందనే ప్రచారం తెరపైకొస్తోంది.
జనసేనాని పవన్ కళ్యాణ్ తన సోదరుడు నాగబాబుని రాజ్యసభకు పంపుతారన్నది ఆ ప్రచారం తాలూకు సారాంశం. నాగబాబు గనుక రాజ్యసభకు ఎంపికైతే, ఆ వెంటనే ఆయనకు కేంద్ర మంత్రి పదవి వస్తుందన్న ఊహాగానాలూ లేకపోలేదు.
అయితే, జనసేన పార్టీ అసలు కేంద్ర మంత్రి పదవిని కోరనే లేదన్నది ఓ వాదనగా కనిపిస్తోంది. టీడీపీ శ్రేణులు ఈ వాదనని బలంగా తెరపైకి తెస్తున్నాయి. పవన్ కళ్యాణ్కి ఏపీ డిప్యూటీ సీఎంగా, జనసేన పార్టీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్లకు మంత్రులుగా అవకాశం దక్కిన సంగతి తెలిసిందే.
అయితే, కేంద్ర మంత్రి పదవి.. అంటే, ఆ లెక్క వేరు. ఢిల్లీ స్థాయిలో జనసేన పార్టీ తనదైన రాజకీయం చేయడానికి, ఆ పదవి ఉపయోగపడేదే. ఏమో, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ముందు ముందు ప్రధాని మోడీ తన మంత్రి వర్గంలో జనసేనకు అవకాశం కల్పిస్తారేమో.! కేంద్ర మంత్రి పదవుల్ని జనసేన కోరి వుండకపోయినా, బీజేపీకి మాత్రం ఆ బాధ్యత వుంది.