ప్రతిపక్ష నేత అనే హోదా దక్కితేనే, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళతారట.! ఈ మాట ఆయన స్వయంగా చెప్పలేదు. కానీ, వైసీపీ నేతల్లో చాలామంది ఇదే చెబుతున్నారు.. అదీ ఆఫ్ ది రికార్డుగా.
‘అసెంబ్లీకి వెళ్ళబోనని వైఎస్ జగన్ అనలేదు. ఆయన ఖచ్చితంగా అసెంబ్లీకి వెళతారు. ఎమ్మెల్యేగా పదవీ ప్రమాణ స్వీకారం అసెంబ్లీలో వైఎస్ జగన్ ఇప్పటికే చేశారు కదా..’ అంటోంది వైసీపీ.! కానీ, తెరవెనుక వ్యవహారాలు వేరే వున్నాయి.
సాధారణ సభ్యుడిగా, ఓ పార్టీ ఫ్లోర్ లీడర్గా మాత్రమే అసెంబ్లీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గుర్తిస్తామనీ, ప్రతిపక్ష నేత హోదా ఆయనకు దక్కే అవకాశమే లేదని శాసన సభా వ్యవహారాల మంత్రి ఇప్పటికే ప్రకటన చేయడం చూశాం. దాంతో, వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళతారా.? లేదా.? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
ప్రతిపక్ష నేత హోదా.. అంటే, అసెంబ్లీలో కొన్ని ప్రత్యేకమైన అవకాశాలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వుంటాయి. ఏదన్నా విషయమ్మీద చర్చ జరుగుతున్నప్పుడు, ప్రతిపక్ష నేతకు తగినంత సమయం ఇవ్వాల్సి వుంటుంది. ఇస్తారా.? లేదా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, నాలుగైదు సార్లు అడిగితే, ఓ సారైనా మైక్ ఇవ్వక తప్పదు.
ఇది కాకుండా, ఇంకా చాలా వెసులుబాట్లు వుంటాయి. అందులో, క్యాబినెట్ మినిస్టర్ స్థాయి. ఏదన్నా కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలంటే, దానికీ కొన్ని నిబంధనలుంటాయ్.. ఆయన ప్రతిపక్ష నేత అయితే. ఇలా చెప్పుకుంటూ పోతే, చాలా ప్రత్యేక అవకాశాలు ప్రతిపక్ష నేతకు వుంటాయి.
మరి, ప్రతిపక్ష నేత హోదా వున్నప్పటికీ గతంలో చంద్రబాబుని అరెస్ట్ చేశారు కదా.? అంటే, అది వేరే సందర్భం. నాలుగేళ్ళపాటు అరెస్టు విషయమై వైసీపీ ముందూ వెనుకా చూడాల్సి వచ్చింది.. ఆ ప్రతిపక్ష నేత హోదా వల్లనే.
ఇదిలా వుంటే, అసెంబ్లీలో తమకు మైక్ ఇవ్వరని వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యల వెనుక పెద్ద అర్థమే వుంది. ఆ సాకు చూపి, అసెంబ్లీకి వెళ్ళకూడదనే ఆలోచనతోనే వైఎస్ జగన్ వున్నారు. ప్రతిపక్ష నేత హోదా దక్కినా జగన్, అసెంబ్లీకి వెళ్ళే అవకాశమే లేదట. మరి, ఐదేళ్ళు ఎలా.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రప్పించడం ఇప్పుడు కూటమికి పెద్ద టాస్క్.! జగన్ తనంతట తానుగా అసెంబ్లీకి దూరంగా వుండాలనుకుంటున్నా, పైకి మాత్రం, తప్పుని కూటమి వైపు ఆయన నెట్టేసేలా వైసీపీ ప్రొజెక్షన్ ఖచ్చితంగా వుంటుంది.