రానున్న రోజుల్లో తెలుగు దేశం పార్టీ సింగిల్ డిజిట్కి పడిపోతుందంటూ, ఓ కోయిల తొందరపడి ముందే కూసేసింది.! రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. 2019 ఎన్నికల్లో టీడీపీకి కేవలం 23 అసెంబ్లీ సీట్లు మాత్రమే వస్తాయని ఎవరైనా ఊహించారా.? 2024 ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమవుతుందని ఎవరైనా అంచనా వేయగలిగారా.? ఏమో, 2029 ఎన్నికల్లో ఏమైనా జరగొచ్చు.
కానీ, 2029 ఎన్నికల గురించి, 2024 ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులు కాకుండానే, కేవలం పదకొండు సీట్లకు పరిమితమైపోయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెబితే ఎలా వుంటుంది.? కామెడీగానే కాదు, అసహ్యంగా కూడా వుంటుంది మరి.!
2029 ఎన్నికల్లో ఏం జరుగుతుందన్నది వేరే చర్చ. ఇప్పుడైతే, సింగిల్ డిజిట్కి జస్ట్ రెండు అడుగుల దూరంలో మాత్రమే వున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే, సింగిల్ సీటుకి జస్ట్ పది అడుగుల దూరంలో మాత్రమే వైఎస్ జగన్ నిలుచుకుని వున్నారు.
వైసీపీ హయాంలో పార్టీ ఫిరాయింపులు జరిగినట్లు, ప్రస్తుతం టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి హయాంలో కూడా పార్టీ ఫిరాయింపులు చోటు చేసుకుంటే, జస్ట్ కొన్ని రోజుల వ్యవధిలో, వైసీపీ సంఖ్యాబలం (ఎమ్మెల్యేల సంఖ్య పరంగా) ఒకటికి పడిపోవడం పెద్ద కష్టమేమీ కాదు.
మాజీ ముఖ్యమంత్రి అనే ట్యాగ్ జగన్కి ఎలాగూ వుంటుంది. కూటమిలోని మూడు పార్టీలూ అధికారాన్ని పంచుకుంటున్న దరిమిలా, ప్రతిపక్ష హోదా లేకపోయినా.. వైసీపీనే ప్రతిపక్షమవుతుంది. ప్రజల తరఫున వైసీపీ అధినేతగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చట్ట సభల్లోనూ, ప్రజాక్షేత్రంలోనూ గట్టిగా నిలబడాల్సి వుంది.
కానీ, వైఎస్ జగన్ చేస్తున్న సింగిల్ డిజిట్ వ్యాఖ్యలతో, ‘11 సీట్లు అయినా వైసీపీకి ఎందుకు ఇచ్చాం.?’ అని ప్రజలు ప్రశ్నించుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి జారిపోతే, వైసీపీకి శాసనసభలో బలం సింగిల్ డిజిట్. పది మంది ఔట్ అయిపోతే, శాసన సభలో జగన్ ఒక్కడే.! ఇదీ దేవుడి స్క్రిప్ట్ అంటే.!