ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. స్పీకర్ కి లేఖ రాశారు. ప్రతిపక్ష హోదా దక్కాలంటే 10 శాతం సీట్లు గెలుచుకోవాలన్న నిబంధన రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. ఆ నిబంధనని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోను ఇటు పార్లమెంటులోనూ ఇప్పటివరకు ఎవరూ అనుసరించలేదంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.
మంత్రుల తర్వాత తనతో ప్రమాణ స్వీకారం చేయించడాన్ని ఖండించిన జగన్.. తమకి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ముందుగానే అధికారపక్షం నిర్ణయించుకుందని ఆరోపించారు. ప్రజల సమస్యలు వినిపించాలంటే అసెంబ్లీలో భాగస్వామ్యం ఉండాలని పేర్కొన్న ఆయన.. ఎన్నికల్లో కూటమి తర్వాత ఎక్కువ సీట్లు ఉన్న తమకు ప్రతిపక్ష హోదా కల్పించి సభలో చట్టబద్ధ భాగస్వామ్యం ఇవ్వాలని లేఖ లో పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. కనీసం 18 సీట్లు గెలుచుకున్న వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నాయి.