దేవుడి స్క్రిప్ట్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కనీసం ‘ప్రతిపక్షం’ అనే స్థాయి కూడా ఇవ్వలేదు మరి.! పైన దేవుడు, ఇక్కడ ప్రజలు.. గూబ గుయ్యిమనేలా కొట్టారంటూ, 2019 ఎన్నికల్లో గెలుపు నేపథ్యంలో టీడీపీ మీద వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో వుండి చేసిన వ్యాఖ్యల్ని మర్చిపోలేం.
ఇప్పుడు వైసీపీ పరిస్థితేంటి.? జస్ట్ 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వైసీపీ తరఫున అసెంబ్లీలోకి అడుగు పెడతారు. ప్రతిపక్షం హోదా కూడా లేదు వైసీపీకి. పద్ధతి ప్రకారం, ఏదో మూలన వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో చోటు దక్కుతుంది.
మామూలుగా అయితే, అసెంబ్లీలో ప్రతి శాసన సభ్యుడికీ తగిన గౌరవం వుండాలి. ఆ పద్ధతులకు తిలోదకాలు ఇచ్చేసింది రాజకీయం.. ఎన్నో దశాబ్దాల క్రితమే.! టీడీపీని అసెంబ్లీలో ఎంత నీఛాతినీఛంగా వైసీపీ దూషించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
సుదీర్ఘకాలం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబునాయుడిపై అత్యంత దిగజారుడు వ్యాఖ్యలు చేసిన వైసీపీ, ఆయన కంటతడి పెడుతూ అసెంబ్లీని వీడేలా చేసింది. దానికి టీడీపీ బదులు తీర్చుకోకుండా వుంటుందా.? మామూలుగా అయితే, అలాంటి కక్ష సాధింపు చర్యలకు టీడీపీ పాల్పడకూడదు.
ఇక, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి అసెంబ్లీలో వైఎస్ జగన్ చేసిన దిగజారుడు వ్యాఖ్యలు, జనసేన తరఫున ఎంపికైన శాసన సభ్యులు సీరియస్గా తీసుకోకుండా వుంటారా ఇప్పుడు.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే.
164 ఓ వైపు, 11 మాత్రమే ఇంకో వైపు.! వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి అసెంబ్లీలో హృదయ విదారకంగా వుండబోతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన అసలు అసెంబ్లీకి హాజరు కాకపోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. హాజరైనా, ఆయనసలు సెషన్స్లో కనిపించే అవకాశం చాలా చాలా తక్కువ.