చేసిన పాపం ఊరికే పోదు.! రాజకీయాల్లో ఇది ఇంకా బాగా పనిచేస్తుంది.! 2019 ఎన్నికల్లో బంపర్ మెజార్టీ కొట్టి, విర్రవీగిన వైసీపీకి, ఇప్పుడు దేవుడి స్క్రిప్ట్ ప్రకారం కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయ్.! దీన్నే కర్మ ఫలితం అనాలేమో.!
అప్పట్లో వైసీపీకి 23 అసెంబ్లీ సీట్లు రాగా, జనసేన పార్టీకి ఓ సీటు దక్కింది. టీడీపీ నుంచి కొందర్ని లాగేసిన వైసీపీ, జనసేనకి చెందిన ఒకే ఒక్క ఎమ్మెల్యేని కూడా లాగేసింది. అంతేనా, ‘మీ పార్టీ నుంచి ఐదుగుర్నో ఆరుగుర్నో లాగేస్తే, మీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు..’ అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సాక్షాత్తూ టీడీపీని ఉద్దేశించి అసెంబ్లీలోనే వెటకారం చేశారు.
ఇప్పుడేమయ్యింది.? ప్రతిపక్ష హోదాని వైసీపీ అడుక్కోవాల్సి వస్తోంది. ఇంకా పార్టీ ఫిరాయింపులు మొదలవకుండానే. ఇదీ దేవుడి స్క్రిప్టు అంటే. చట్ట సభల్లో ప్రతిపక్ష హోదా కావాలంటే, కనీసం 10 శాతం సంఖ్యాబలం వుండాలన్నది ఓ నిబంధన.
ఆ లెక్కన వైసీపీకి అసెంబ్లీలో వుండాల్సిన శాసన సభ్యుల సంఖ్య 18. అయితే, వైసీపీకి ప్రస్తుతం వున్న శాసన సభ్యుల సంఖ్య 11 మాత్రమే. సంఖ్యా పరంగా చూసుకుంటే, జనసేన పార్టీకి 21 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలి. అయితే, జనసేన పార్టీ ప్రస్తుతం ప్రభుత్వంలో భాగమై వుంది.
శాసన సభలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా.? వద్దా.? అన్నదానిపై టీడీపీ అలాగే జనసేన.. ఇంకోపక్క బీజేపీ.. ఈ మూడూ కలిసి సానుకూల నిర్ణయం తీసుకుంటే, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కాస్త ఊరట దక్కుతుంది.
గతంలో, వైసీపీ గతంలో చేసిన అవమానాల నేపథ్యంలో, వైసీపీకి తగిన శాస్తి చేయాలనే ఆ మూడు పార్టీలూ అనుకుంటున్నాయి. తప్పు తెలిసొచ్చేలా చేయకపోతే, ఎప్పటికీ వైసీపీలో మార్పు రాదు.! పైగా, ప్రతిపక్ష హోదా కావాలంటూ స్పీకర్కి రాసిన లేఖలో, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘బతిమాలుకోవడం’ మానేసి, రూల్స్ మాట్లాడేశారు మరి.!
ఇంతకీ, ప్రతిపక్ష హోదా దేనికి.? ప్రతిపక్ష నేత హోదా వుంటే, అది క్యాబినెట్ ర్యాంక్తో సమానం. జీత భత్యాలు కూడా ప్రత్యేకంగా వుంటాయి. జీత భత్యాలతో ఇబ్బందేమీ లేదుగానీ, ఆ క్యాబినెట్ హోదా కోసమే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడిలా దేబిరించాల్సి వస్తోంది.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్రానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ (ముఖ్యమంత్రి హోదాలో కూడా) ఇంతలా లేఖ రాసింది లేదు. తనకు ప్రతిపక్ష నేత హోదా కావాల్సి వచ్చేసరికి, ఏకంగా నాలుగు పేజీల సుదీర్ఘ లేఖ రాసేశారు.
వై నాట్ 175 అంటూ విపక్షాల్ని అవమానించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీకి జస్ట్ 11 సీట్లు మాత్రమే మిగిలాయ్. పార్టీ ఫిరాయింపుల పర్వం షురూ అయితే, సింగిల్ సింహంలా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైసీపీలో మిగిలిపోతారంతే.!