ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మాజీ సీఎం జగన్ డిప్రెషన్ కి గురైనట్లు తెలుస్తోంది. గతవారం ఆయన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాల అనంతరం తన మానసిక పరిస్థితిని పార్టీ నేతలకు వివరించారు.
ఈ క్రమంలో.. ‘ ఫలితాలను చూసి షాక్ అయ్యా.. ప్రజలకు ఇంత చేస్తే ఇలాంటి ఫలితం వచ్చిందేంటి అనుకున్నా. అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోదాం అనిపించింది. ఆ షాక్ నుంచి బయటకు రావడానికి రెండు, మూడు రోజులు పైనే పట్టింది. కానీ సీట్లు గెలుచుకోలేకపోయినా 40% ఓట్లు మన పార్టీకి వచ్చాయి. అంటే అంత పెద్ద స్థాయిలో ప్రజలు మన పార్టీపై నమ్మకం పెట్టుకున్నారు. మన పార్టీపై విశ్వాసం ఉంచిన ప్రజల కోసం నిలబడాలి అనిపించింది. అందుకోసమే ఆ పరిస్థితుల నుంచి బయటకు వచ్చాను. ఫలితాలపై అనుమానాలు, కారణాల మాట పక్కన పెట్టి.. ప్రజల పక్షాన నిలబడాలి. ప్రస్తుత మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. నాలాగే మీరు కూడా ఆ పరిస్థితుల నుంచి బయటకు వచ్చి.. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అండగా ఉండే ప్రయత్నం చేయండి’ అని మాజీ సీఎం జగన్ అన్న మాటలు ఆలస్యంగా బయటికి వచ్చాయి.