రాజకీయాల్లో గెలుపోటములు సహజం.! వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం, కాంగ్రెస్ పార్టీని కాదని సొంత పార్టీ పెట్టుకుని, రాజకీయంగా ఎదిగారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రతిపక్షంలో వున్నారు.. అధికార పీఠమెక్కారు. కానీ, ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితి.
అత్యద్భుత విజయం నుంచి, అత్యంత దారుణమైన పరాజయాన్ని ఎందుకు చవిచూడాల్సి వచ్చింది.. అన్న విషయమై ఆత్మ విమర్శ చేసుకోలేని పరిస్థితి.. వైసీపీ పతనానికి కారణమయ్యేలా వుంది. ఎవరో మోసం చేశారంటూ వైఎస్ జగన్, ఓటమి పాలైన వెంటనే చేసిన వ్యాఖ్యలు, ఓటర్లకు వైసీపీ పట్ల అసహ్యం పెరిగేలా చేశాయన్న చర్చ అంతటా జరుగుతోంది.
సంక్షేమ పథకాలంటే, ప్రభుత్వంలో వున్న తాము.. ప్రజలకు వేసే బిచ్చం.. అనే భావించారు వైసీపీ నేతలు గతంలో. ఆ లెక్కన, ప్రజలు మోసం చేశారంటే, ప్రభుత్వంలో వుండి తాము వేసిన బిచ్చం తిని, తమను ఓడించారనే అక్కసు వైసీపీ వెల్లగక్కినట్టే కదా.?
రాజకీయాల్లో ఇది కాదు ఆత్మ విమర్శ చేసుకునే పద్ధతి. ఓటమి ఎలా.? అన్న విషయమై ఆత్మపరిశీలన చేసుకుని, ‘మేం మారాం..’ అని జనం ముందుకు రావాల్సి వుంటుంది. ఈ క్రమంలో అవసరమైతే, తాము చేసిన తప్పుల్ని కూడా జనం ముందు ఒప్పుకోవాల్సి వుంటుంది. కానీ, ఇలా వైసీపీ అధినాయకత్వానికి చెప్పేదెవరు.?
మంత్రులుగా పనిచేసినవాళ్ళు సైతం, ఈవీఎం ట్యాంపరింగ్ అనో.. జనం మోసం చేశారనో.. అంటోంటే, కార్యకర్తలకే ఇప్పుడు ఏమీ అర్థం కాని పరిస్థితి. అధినేత బాటలోనే మంత్రులు.. కానీ, కార్యకర్తల వ్యవహారం వేరేలా వుంటుంది.
కేవలం 11 అసెంబ్లీ, నాలుగు లోక్ సభ సీట్లతో ఐదేళ్లపాటు రాజకీయంగా మనుగడ సాధించడం వైసీపీకి కష్టసాధ్యమైన వ్యవహారమన్న చర్చ వైసీపీ శ్రేణుల్లో జరుగుతోంది. కొందరు నాయకులూ ఇదే అభిప్రాయంతో వున్నారు. అధినేత వైఎస్ జగన్, పార్టీ శ్రేణులకు చిక్కకుండా బెంగళూరు వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే.
పార్టీ శ్రేణుల అంతర్మధనం, ఆవేదన, ఆందోళన.. వీటన్నిటినీ అధినేత సక్రమమైన పద్ధతిలో అర్థం చేసుకుని, పార్టీలోని సమస్యల్ని సరిదిద్దుకుంటే తప్ప, వైసీపీ మనుగడ అసాధ్యం.