ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం ముందు ముందు మరింత రసవత్తరంగా మారబోతోంది. ఇటీవలి ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 అసెంబ్లీ, 4 లోక్ సభ సీట్లకు పరిమితమైపోయిన సంగతి తెలిసిందే. లోక్ సభ సీట్లు తక్కువే వున్నా, రాజ్యసభలో తమకు మంచి బలం వుందనీ, అసెంబ్లీ సీట్లు తక్కువ వున్నా, శాసన మండలిలో తమకు బలం వుందనీ.. వైసీపీ చెప్పుకుంటోంది.
అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న వైసీపీలో కొనసాగేందుకు, ప్రజా ప్రతినిథులు అంత ఆసక్తి చూపడంలేదన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పుడున్న రాజకీయాల్లో, ఇలా బలం లేని విపక్షంలో కొనసాగడం ఏ ప్రజా ప్రతినిథికి అయినా, కష్ట సాధ్యమే మరి.!
తాజాగా, వైసీపీ నుంచి పలువురు ఎంపీలు బీజేపీలోకి దూకేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ‘మేం వైసీపీతోనే వుంటాం..’ అని పైకి చెబుతూనే, తెరవెనుక, బీజేపీతో ఆయా ప్రజా ప్రతినిథులు మంతనాలు జరుపుతున్నారట. బీజేపీతోనే ఎందుకు.? అన్నదానిపై భిన్నవాదనలున్నాయి.
మరీ ముఖ్యంగా పార్లమెంటు సభ్యులకు పార్టీ మారే క్రమంలో బీజేపీ బెస్ట్ ఛాయిస్గా కనిపిస్తోంది. గతంలోనూ ఇదే పరిస్థితి చూశాం. ఇప్పుడు ఇంకోసారి అదే సీన్ రిపీట్ అయ్యేలా వుంది. పార్టీ మారాలనుకుంటే, రాజీనామా చేసి రావాలని గతంలోనే జనసేన ‘షరతు’ పెట్టిన సంగతి తెలిసిందే.
గతంలో పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించిన టీడీపీ, ఇప్పుడు తమకు అలాంటి అవసరమే లేదన్న కోణంలో, ‘రాజీనామా చేసిన తర్వాతే రావాలి’ అన్న షరతు విధిస్తోందిట. ఈ క్రమంలో బీజేపీ వైపే, వైసీపీ ప్రజా ప్రతినిథులు చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఓ ఎంపీ (లోక్ సభ), మరో ఇద్దరు ఎంపీలు (రాజ్యసభ) ఇప్పటికే బీజేపీతో టచ్లోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుల్లో వీలైనంత ఎక్కువమందిని లాగేస్తే, గతంలో టీడీపీ రాజ్యసభ సభ్యుల్ని విలీనం చేసుకున్నట్లుగా చేయొచ్చని బీజేపీ అనుకుంటోందిట.
బీజేపీకి కూడా ఇటు లోక్ సభ, అటు రాజ్యసభ సభ్యుల అవసరం వున్న దరిమిలా, బీజేపీ అధినాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే, చేరికలు వుంటాయని అంటున్నారు.